పెట్టుబడులలో మరోసారి సత్తా చాటిన రైజింగ్ ఆంధ్ర..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రైజింగ్ ఆంధ్ర పెట్టుబడుల ప్రవాహంలో మరోసారి సత్తా చాటిందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  విశాఖ సీఐఐ సదస్సులో వెల్లువెత్తిన పెట్టుబడుల సునామీతో ఐయిదేళ్లలో పైసా తీసుకునిరాని వైకాపా వాళ్లకు పెట్టుబడుల సునామీ చూసి, కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు.  నవ్యాంధ్రప్రదేశ్‌ బిల్డ్ కు  బలమైన బ్లూ ప్రింట్ ఇచ్చిన కార్యక్రమంపైనా బ్లూ మీడియా విషం కక్కడం విషాదకరమని మండిపడ్డారు. 12 ప్రధాన రంగాల్లో 13.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు కుదరడం రాష్ట్ర చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్ అన్న జీవీ.. అందుకు సంతోషించాల్సింది పోయి..,చౌకబారు విమర్శలు చేయడం వైకాపా దివాళాకోరు, దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. కూటమి మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి న 20లక్షల ఉద్యోగాలకు మించిన ఫలితాలు ఏడాదిలోనే సాధించడం శుభ పరిణామమన్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సుతో రాష్ట్ర ఆర్థిక జీవనాడిగా ఉన్న విశాఖకు బలమైన పునాది పడిందని, పెట్టుబడిదారుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం లక్షల కోట్ల పెట్టుబడులే అన్నారు. మంచి పాలన, ఆకర్షణీయ మైన విధానాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణం… అన్నీ వెరసి అంతర్జాతీయ పెట్టుబడి దారులకు ఏపీని అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలబెట్టాయని తెలిపారు. స్టార్టప్స్‌ నుంచి మెగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ వరకు వివిధ రంగాల్లో పెట్టుబడులు రావడం వల్ల ప్రతి జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.